ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‎కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్‎కి చేసిన ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారు. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖలో ఉన్నారని, వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారించే తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని, ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.