ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈవీడ్కోలు కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి మెరుగైన సేవలు అందించారని పేర్కొన్నారు.ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనేది తప్పని సరని, ఉద్యోగ విధులను మెరుగైన రీతిలో నిర్వహించడం ద్వారా మంచి మన్ననలు పొందవచ్చని తెలిపారు. 1990లో ఐఏఎస్ కు ఎంపికైన ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగ ప్రస్ధానాన్ని రాజమండ్రి సబ్ కలక్టర్ గా మొదలు పెట్టారని గుర్తు చేశారు. ప్రవీణ్ కుమార్ మంచి మానవతా భావాలు గల వ్యక్తని కొనియాడారు. ప్రవీణ్ కుమార్ తన కేరీర్ వివిధ హోదాల్లో మెరుగైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన శేష జీవితమంతా సుఖశాంతులతో ఆయురాగోగ్యాలతో సాగాలని సిఎస్.జవహర్ రెడ్డి ఆకాంక్షించారు. అదే విధంగా సహాయ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆకుల వెంకట కనకదుర్గ తన కేరీర్ లో మెరుగైన సేవలు అందించారని ఆమె సేవలను కొనియాడారు.
స్పెషల్ సిఎస్ గా పదవీ విరమణ చేసిన కె.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు సహకరించిన అధికారులు,సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాధాలు తెలియజేశారు. ఉద్యోగులు టీంగా ఉండి సేవలు అందించ గలిగితే ప్రభుత్వానికి మంచి సేవలను అందించ వచ్చని అన్నారు.తన కేరీర్ లో అధిక శాతం సర్వీసు ఐటి శాఖలో జరిగిందని గుర్తు చేశారు.తన కుటుంబంలో 10 మందికి పైగా అఖిల భారత అధికారులుగా సేవలందించారని వారిలో తాను 9వ వాడిని కాగా తన భార్య సునీత 10 వ్యక్తిని అన్నారు. పదవీ విరమణ చేసిన కనకదుర్గ మాట్లాడుతూ తన కేరీర్ లో సహకరించిన అధికారులు, సిబ్బంది అందరకీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ, సెక్రటరీ పొలిటికల్ డా.ఎన్.యువరాజ్, ముఖ్య కార్యదర్శి కె.సునీత తదితరులు మాట్లాడుతూ స్పెషల్ సిఎస్.ప్రవీణ్ కుమార్ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్,వెంకట కనకదుర్గలను దుశ్శాలువ, జ్ణాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ స్వాగతం పలికగా జిఏడి అదనపు కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు వందన సమర్పణ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమీషనర్లు రెహానా బేగం, డా.ఉదయ భాస్కర్,సాధారణ పరిపాలన శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది, సచివాలయం వివిధ విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.