ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్  కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉమేశ్‌చంద్ర వాదించారు. ఆర్టికల్‌ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చని తెలిపారు. పిటిషనర్‌ వాదనలపై కౌంటరు దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది….