ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈవో మీనా లేఖ రాశారు. బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఈవో మీనాకు వైసీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు, మరికొన్నింటికి స్పందించలేదు. అయితే చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను కూడా జత చేశారు. ప్రజాగళం పేరుతో నిర్వహిస్తోన్న ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.