ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్ లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. వాస్తవానికి దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్ లోనా లేదా వీవీప్యాట్లోనా ? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా ? అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని స్పష్టం చేసింది. ఈ విచారణ సందర్భంగా ఈవీఎమ్ సోర్స్ కోడ్కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్ కోడ్ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించింది.ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టును వివరించింది.
‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !
Related Posts
సింహపురిలో గర్జించిన కూటమి
ప్రభాతదర్శిని,:(నెల్లూరు-ప్రతినిధి): సింహపురి సీమ జనసంద్రమైంది. నగరమంతా మూడు పార్టీల జెండాలతో, తరలివచ్చిన అభిమానగణంతో చరిత్ర సృష్టించింది. కనివీని ఎగురని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రోడ్షో నభూతో న…
హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడు స్థానిక ఎమ్మెల్యే… మాజీ ఎంఎల్ సి వాకాటి నారాయణరెడ్డి ధ్వజం
ప్రభాతదర్శిని, (నాయుడుపేట ప్రతినిధి): స్థానిక ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడని మాజీ ఎమ్మెల్సీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నాయుడుపేట లో శుక్రవారం జరిగిన సీనియర్ రాజకీయవేత్త కనుమూరు గోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు కాటూరి ఫణీందర్…