ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): నెల్లూరు జిల్లా,కందుకూరు నియోజక వర్గ కాపు – బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా కందుకూరు పట్టణానికి చెందిన చదలవాడ కామాక్షి నాయుడును ఎంపిక చేసారు. ఇందుకు సంబంధించి నియామకపు పత్రాన్ని నెల్లూరు జిల్లా కాపు – బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బెల్లపు వెంకట సుధా మాధవ్ ఆమెకు అంద జేశారు. పార్టీ ఏదైనా, పదవి ఏదైనా సరే అప్పగించిన పనులను భాద్యతగా నిర్వహించి అధినేత దృష్టిలో శభాష్ అనిపించు కున్న నేతలు ఎవరైనా సరే వారికి రాజకీయ మనుగడ తప్పకుండా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే, ఇప్పటి వరకు తమ అధినేత మానుగుంట. మహీధర రెడ్డి మాటలను వేదవాక్కు గా భావించి ముందుకు వెళుతున్న మహిళా నేతలలో కందుకూరు నియోజక వర్గ మహిళా నేత చదలవాడ కామాక్షి నాయుడు ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నప్పటికి పథక రచన, పోల్ మేనేజ్మెంట్ లో మంచి పరిజ్ఞానం ఉన్న మహిళా నేత గా ఆమె ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కామాక్షి నాయుడు తొలుత కందుకూరు పట్టణం లోని 17వ వార్డులో రాజకీయ అరంగ్రేటం చేయడం జరిగింది. ఆమె లో వున్న చురుకుతనం, పట్టుదల, వాక్ పటిమను గుర్తించిన మహీధర రెడ్డి ఆమెను తొలుత కందుకూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ఆ సమయంలో ఆమె కందుకూరు పట్టణంలోని మహిళలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం జరిగింది. ఆ తరువాత ఆమెను కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కూడా మహీధర రెడ్డి నియమించడం జరిగింది. వాక్ పటిమ ఉన్న మహిళా నేత మాత్రమే కాకుండా, మహీధర రెడ్డి స్వగ్రామం మాచవరం గ్రామం కామాక్షి నాయుడుకు మెట్టినిల్లు. ఈ కారణం చేత ఆమె మహీధర రెడ్డి బృందంలో ఒక మంచి స్థానాన్ని పొందినది. మారిన రాజకీయాల కారణంగా కందుకూరు నియోజక వర్గం స్థానాన్ని మహీధర రెడ్డికి కాకుండా అధిష్ఠానం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధు సూధాన్ యాదవ్ కు సీటును కేటాయించడం జరిగింది. దీనితో బాధాతప్తులైన కొందరు మహీధర రెడ్డి అభిమానులు తమ అభిమాన నేతకు పార్టీలో సముచిత స్థానం లేనపుడు మాకు ప్రాధాన్యత ఏమి ఉంటుందనే ఉద్దేశ్యంతో రానున్న ఎన్నికల్లో ఎవరికి నచ్చిన విధంగా వారు మిగిలిన పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగా మహీధర రెడ్డి అభిమానులు ఇప్పటికే కొందరు వైకాపా, తెలుగు దేశం పార్టీ లకు మద్దతు ప్రకటించగా, మరి కొందరు మాత్రం జన సేన పార్టీ వైపు మొగ్గు చూపు తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపని కామాక్షి నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల సంప్రదింపుల అనంతరం ప్రస్తుతానికి కందుకూరు నియోజక వర్గ కాపు – బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలిగా భాద్యతలను నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ వెనువెంటనే నెల్లూరు జిల్లా కాపు – బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బెల్లపు సుధా వెంకట మాధవ్ ఆమెకు నియామక పత్రాన్ని నెల్లూరు లో స్వయంగా అంద జేశారు. ఈ సందర్భంగా కామాక్షి నాయుడు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాను ఇంత వరకు కాంగ్రెస్,వైకాపా లలో మహీధర రెడ్డి సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం జరిగిందని, అయితే ఇక నుంచి తన శక్తి సామర్థ్యాలను గుర్తించి తనకు బాధ్యతాయుత మైన పదవిని కేటాయించిన కే.బి.ఎస్.ఎస్. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బెల్లపు సుధా మాధవ్ ఆదేశాల ప్రకారం కందుకూరు నియోజక వర్గం పరిధి లో పని చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. కందుకూరు నియోజక వర్గం పరిధి లోని 5 మండలాలకు చెందిన కాపు,బలిజ సంఘం నాయకులతో,మేధావులతో చర్చించి త్వరలోనే కందుకూరు నియోజక వర్గ స్థాయి కే.బి.ఎస్.ఎస్ కమిటీని పూర్తి స్థాయిలో నియమించడం జరుగుతుందని కామాక్షి నాయుడు తెలియ జేశారు. ఇదిలా ఉండగా కందుకూరు నియోజక వర్గ కే.బి.ఎస్.ఎస్. మహిళా విభాగం అధ్యక్షురాలు గా నియమితులైన చదలవాడ.కామాక్షి నాయుడుకు జిల్లా కే.బి.ఎస్.ఎస్.ఉపాధ్యక్షురాలు శైలజా నాయుడు, నెల్లూరు నగర కే.బి.ఎస్.ఎస్.మహిళా అధ్యక్షురాలు బి.గౌరీ తదితరులు హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు.